
- చిన్న సంఘాలను కించపరచొద్దు
- అశోక్బాబుపై మండిపడ్డ ఏపీజేఏసీ
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘ఉద్యోగ, ఉపాధ్యా య, కుల, కార్మిక, కర్షక, హిజ్రా సంఘాలన్నీ కలిసి సమైక్యాంధ్ర కోసం కష్టపడినందువల్లే నీకు పేరొచ్చింది. ఇప్పుడు మా జేఏసీలో కుల సంఘాలున్నాయి అంటున్నారు. అంద రం కలిసి ఉద్యోగుల సమస్యలపై పోరాడితే తప్పేంటి? నీకో న్యాయం... మాకో న్యాయమా?’ అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్బాబుపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘాల ఏపీ జేఏసీ అమరావతి మండిపడింది. తమ జేఏసీలోని సంఘాల నాయకుల్ని అశోక్బాబు లిఫ్టు ఆపరేటర్లు అని కించపరిచారని, అలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికింది. ఏపీ జేఏసీ అమరావతి ప్రథ మ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. 84 సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ లోగోను, వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా జిల్లా జేఏసీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రూసా నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు. అనేక బోగస్ సంఘాలున్నాయని, వాటిని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. తమవైపు ఉన్న 84 సంఘాల నాయకుల్ని విజయవాడ తీసుకొచ్చి చూపామని, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో చెప్పాలని అశోక్బాబును డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో ఒక్కటే జేఏసీ ఉందని అది తమదేనని స్ప ష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి కలిసివస్తామంటే ఏపీఎన్జీవోల సంఘంతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని వివరించారు. తమ జేఏసీ ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించిందని బొప్పరాజు తెలిపారు. 1.87లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ వచ్చేలా చేశామన్నారు. ఒకట్రెండు రోజుల్లోనే వారికి పెన్షన్లు ఇచ్చే ఉత్తర్వులు కూడా వస్తాయన్నారు. సీపీఎస్ విధానం రద్దుచేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఆం ధ్రా ఉద్యోగుల కేసు కోర్టులో హియరింగ్కు వచ్చేలా చేయడంలో కీలకపాత్ర పోషించామన్నారు. కాంట్రాక్టు, కాంటింజెంట్, ఎన్ఎంఆర్ల క్రమబద్ధీకరణకు కృషిచేస్తున్నామన్నా రు. ఉద్యోగులకు ఇళ్లస్థలాల కోసం పోరాటం చేస్తామన్నారు.
ఇవీ డిమాండ్లు
రిటైర్డ్ ఉద్యోగుల వయసు 70ఏళ్లు దాటితే రావాల్సిన 15శాతం అదనపు పెన్షన్ను అమలు చేయాలన్నారు. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దుతో వేతనాలు చెల్లించాలని కోరారు. కారుణ్య నియామకాలకు డిగ్రీ విద్యార్హతలో మార్పులు చేయాలని కోరారు. కొన్ని శాఖల ఉద్యోగులకు బయోమెట్రిక్లో వెసులుబాటు ఇవ్వాలన్నారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఫణిపేర్రాజు, కోచైర్మన్లు యోగేశ్వర్రెడ్డి, రామాంజనేయులు, పి.శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, రవికుమార్, అల్ర్ఫెడ్, కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments
Thanks For Your Valuable Feed Back